ప్రకాశం పంతులు త్యాగస్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మంత్రి బాలవీరాంజనేయస్వామి
ప్రకాశం పంతులు ఆశయాలే అభివృద్ధికి మార్గం
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగస్ఫూర్తి, దేశభక్తి మరియు పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి మంత్రి బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరంలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి గుండె చూపిన మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా సేవలందించడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయుడు ప్రకాశం పంతులు అని మంత్రి కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0