"పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" మంత్రి డోలా బీవీ స్వామి
పోలియో రహిత భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం..మంత్రి డోలా బీవీ స్వామి
మంత్రి డోలా బీవీ స్వామి చేతుల మీదుగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
టంగుటూరు, జూన్ 28 (న్యూస్):
పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 1,56,477 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
భవిష్యత్తు తరాలకు వైకల్యం లేని ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలియో చుక్కల ప్రాధాన్యతపై మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు కేంద్రాలకు రాలేకపోయిన చిన్నారులకు రానున్న రెండు రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖాధికారి టి. వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0